- – కన్నెత్తి చూడని అధికారులు
Patancheru: గత వారం రోజులుగా ఉక్కిరిబిక్కిరి చేసిన వర్షాలకు వరదలు పొంగిపొర్లాయి. మరోవైపు నగరంలో పెద్ద ఎత్తున రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అలాగే ఆయా కాలనీలు ఇప్పటికీ జలమయంలోనే ఉన్నా… అధికారులు మాత్రం ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానిక కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. గత నాలుగు రోజులుగా చిట్కుల్ పంచాయతీ పరిధిలోని నాగార్జున కాలనీ, రాధమ్మ కాలనీ, పార్థ సారథి కాలనీలు ముంపులోనే ఉన్నాయి. అయినా అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. వరద నీటిని మళ్లించి కాలనీ ప్రధాన రహదారిని ముంపు నుంచి రక్షించే ప్రయత్నం చేయాల్సి ఉన్నా అటువంటి చర్యలు ఏమీ తీసుకోవడం లేదు. కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
Also Read: సున్నం చెరువు కబ్జాల కూల్చివేత
ముత్తంగి చెరువు కింద ప్రధాన కాలువను ఆక్రమించి పెట్రోల్ బంక్ తో పాటు పలు అక్రమ నిర్మాణాలు వెకువడడంతో వరద నీరంతా ముత్తంగి, చిట్కుల్ లోని కాలనీల గుండా ప్రవాహిస్తూ రోడ్లను ఖాళీ స్థలాలను వరద ముంచెత్తింది. దీంతో దాదాపు 8 కాలనీలకు వరద సమస్య ఏర్పడి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఇప్పటికే నీటి సమస్యను నీటిపారుదల, రెవెన్యూ అధికారులకు తెలియజేసినా చర్యలు తీసుకోలేదన్నారు. అయితే కాలనీలు వరద నీటితో ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువు కావడంతో ప్రజలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఇతర అదికారులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాలి.